జగిత్యాల, అక్టోబర్ 30: తెలంగాణ రాష్ట్ర ఎంపీ కవిత టీఆర్ఎస్ సోమవారం జగిత్యాలలో జరిగిన యువజన విభాగ సమావేశంలో పాల్గొన్నారు . ఈ సమావేశం భాగంగా మాట్లాడుతూ “గత నాలుగేళ్ళలో కాంగ్రెస్, టిడిపిలకు మేము ట్రైలర్ మాత్రమే చూపించాము. ఇంకా అసలు సినిమా చూపించలేదు. అది చూసి భయపడిపోయిన వాళ్ళు మహాకూటమి పెట్టుకొన్నారు. కానీ త్వరలోనే వాళ్ళకు 3డి సినిమా చూపించబోతున్నాము. మరి అప్పుడేమీ చేస్తారో?” అని అన్నారు.
అయితే మహాకూటమి తమ అభ్యర్ధులను ప్రకటించాక, తెరాసలో మిగిలిన 12 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించాలని సిఎం కేసీఆర్ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కాగా మహాకూటమిలో టికెట్లు లభించని కాంగ్రెస్, టిడిపి ముఖ్య నేతలను తెరాసలోకి రప్పించి వారికి ఆ టికెట్లు ఇవ్వడం ద్వారా మహాకూటమిని దెబ్బ తీయాలని తెరాస అధిష్టానం భావిస్తే అదేమీ విచిత్రమైన విషయం కాబోదు. కనుక మహాకూటమికి తెరాస చూపించబోయే 3డి సినిమాలో ఇవే సీన్లు కనిపించే అవకాశం ఉందని భావించవచ్చు. వొకవేళ ఇంతకంటే గొప్ప సీన్లు ఉన్నా ఆశ్చర్యపోనక్కరలేదు.