న్యూఢిల్లీ : భారతదేశ 14వ రాష్ట్రపతిగా ఉత్తరప్రదేశ్కు చెందిన రామ్నాథ్కోవింద్ ఎన్నికైన సందర్భంగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నిక అత్యంత సవాళ్లతో కూడిన సమయంలో రాజ్యాంగ స్ఫూర్తిని అక్షరాలా నిలబెట్టవలసిన బాధ్యత ఆయన పై ఉందని ఆమె ఈ సందర్భంగా కోవింద్ ని అభినందించారు. సిద్ధాంతాల కోసం తాను చేస్తున్న పోరాటం నేటి తో ముగిసి పోకుండా కొనసాగుతుందని తెలిపారు. సాంఘిక న్యాయం, అందరినీ కలుపుకుపోవడం, లౌకికవాదం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ వంటి విలువల కోసం తాను పోరాడతానన్నారు. మైనారిటీల కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు తనకు మద్దతిచ్చిన ప్రతిపక్ష పార్టీలన్నిటికీ ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.