తిరువనంతపురం, అక్టోబర్ 27: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కేరళలోని కన్నూరులో బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ అయ్యప్ప భక్తులకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే కేరళలో మత విశ్వాసకులకు, ప్రభుత్వానికి మధ్య పోరాటం జరుగుతుందని, శబరిమల వివాదాన్ని కేరళలోని వామపక్ష ప్రభుత్వం పెంచి పోషిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శబరిమలలో అన్ని వయసుల మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను 2000 మందికిపైగా అరెస్టు చేయడాన్ని అమిత్ షా ఖండించారు. ప్రస్తుతం వారు జైళ్లలో ఉన్నారని ఆయన తెలిపారు. శబరిమల వివాదంలో భక్తులకు, కేరళ ప్రజలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని హామీ ఇస్తున్నామని అమిత్ షా స్పష్టం చేశారు. అయ్యప్ప నైష్టిక బ్రహ్మచారి.. కనుకనే ఆ ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశాన్ని నిషేధించారు అని తెలిపారు.