తిత్లీ తుఫాను బాధితులకు అండగా ఉంటాం

SMTV Desk 2018-10-14 17:40:53  pawan kalyan, titli,

శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను విధ్వంసం తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని, తుఫాను బాధితులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. విజయవాడలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌తో కలిసి ప్రారంభించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. జనసేన సైనికులు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. పార్టీలో కొత్తగా చేరిన నాదెండ్ల మనోహర్‌తో కలిసి సాయంత్రం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు చెప్పారు.

విజయవాడలో జనసేన కేంద్ర పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవటం శుభపరిణామమని నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే మనస్తత్వం ఉన్న పవన్‌తో కలిసి పనిచేయాలనే తాను జనసేనలోకి చేరినట్లు వివరించారు. ఈ క్రమంలో దీర్ఘకాల పోరాటాలకు సైతం సిద్దంగా ఉన్నమని తెలిపారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి త్యాగాలకైనా తాము వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈనెల 15న జరగనున్న జనసేన కవాతులో ప్రతి కార్యకర్త, అభిమాని పాల్గొనాలని పిలుపునిచ్చారు. మనోహర్‌తో తనకు పాఠశాల స్థాయి నుంచే పరిచయం ఉందని పవన్‌ తెలిపారు. జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఆయన‌ విలువైన సలహాలు, సూచనలు అందిచేవారని తెలిపారు. సరికొత్త రాజకీయ శకం ఏపీకి కావాల్సిన తరుణంలోనే జనసేన ఆవిర్భవించిందని కేవలం 2019 ఎన్నికల్లో గెలిచేందుకు మాత్రం కాదని పవన్‌ స్పష్టం చేశారు.