హైదరాబాద్: యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో విజయ్ సరసన ముగ్గురు భామలు సందడి చేయనున్నారు. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేశ్, ఇసబెల్ లీట్ కథానాయికలు. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కేఏ వల్లభ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అక్టోబర్ 18న హైదరాబాద్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అదే రోజు ఇందులో నటించబోయే నటీనటులు.. చిత్రానికి పని చేయనున్న సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు తెలియజేస్తామని పేర్కొంది. ప్రేమకథా చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నట్లు తెలిపింది. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. జేకే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు సినిమాను సమర్పిస్తున్నారు.
విజయ్ ఇటీవల ‘నోటా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయన ముఖ్యమంత్రిగా ఆకట్టుకున్నారు. మరోపక్క విజయ్ హీరోగా ‘టాక్సీవాలా’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి.