అక్టోబర్ 06: బాలీవుడ్లో కొత్తగా పోరాటానికి దిగిన తనూశ్రీ మెడకు మరో ఉచ్చు చుట్టుకుంది. 2008లో ఓ సినిమా పాట షూటింగ్లో నటుడు నానా పటేకర్ తనమీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సంచలన వ్యాఖ్యలు చేసింది తనూశ్రీ. ఆ సినిమా దర్శక నిర్మాతలు, డాన్స్ మాస్టర్పై కూడా తనూశ్రీ ఆరోపణలు వెల్లడించింది . తను విశ్రాంతి తీసుకున్న బస్సు మీద దాడి చేశారని తనూశ్రీ పేర్కొంది. కాగా తనూశ్రీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిజాలు కాదు అనే మాటలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్లో చాలామంది నానాపటేకర్కు సపోర్టుగా నిలుస్తున్నారు. నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రి తరఫు న్యాయవాదులు తనుశ్రీకి నోటీసులు పంపారు. తాజాగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్త సుమంత్ దాస్ ఫిర్యాదుతో బీడ్ జిల్లాలోని కైజ్ పోలీస్ స్టేషన్లో తనూశ్రీపై మరో కేసు నమోదైంది. ఓ ఇంటర్వ్యూలో తనూశ్రీ రాజ్ థాకరే, ఎంఎన్ఎస్ల పరువుకు భంగం కలిగించేలా మాట్లాడిందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంఎన్ఎస్ కార్యకర్తలు తనపై బెదిరింపులకు పాల్పడ్డారని తనుశ్రీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అంటున్నారు వాళ్ళు. ఇదిలావుండగా బిగ్బాస్ సీజన్ 12లో తనూశ్రీ పాల్గొంటుందని పుకార్లు షికార్లు చేశాయి. ఎంఎన్ఎస్ యూత్వింగ్ నేతలు బిగ్బాస్ కార్యక్రమ నిర్వాహకులకు లెటర్ ఇచ్చారు. అందులో తనూశ్రీని తీసుకోవద్దని పేర్కొన్నారు. బిగ్బాస్ షోలో తనుశ్రీ పాల్గొంటే చోటుచేసుకునే పరిణామాలకు ఎంఎన్ఎస్కు ఎలాంటి సంబంధం ఉండబోదని హెచ్చరించారు.