అక్టోబర్ 03: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా మంగళవారం పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ భారత 46వ ప్రధాన న్యాయమూర్తిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్ నాధ్ కొవింద్ కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతి భవన్ లో ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో సహా అధికార, ప్రతిపక్షాలకు చెందిన అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన నిలిచినా జస్టిస్ రంజన్ గగోయ్... భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ రంజన్ గగోయ్ 2019 నవంబర్ 17 వరకు ఈ పదవీలో కొనసాగుతారు. జస్టిస్ రంజన్ గగోయ్ అసోమ్ రాష్ట్రానికి చెందినవారు. ఆయన 1978 నుంచి న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. ఫిబ్రవరి 2001లో ఆయన మొదటిసారిగా గువహాటి హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తరువాత 2011 లో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టుకు ప్రధానన్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012 నుంచి నేటి వరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు.