విశాఖపట్నం, జూలై 19 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈరోజు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటింది. ఇది క్రమంగా బలహీన పడుతూ పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి పశ్చిమ దిశ నుంచి గంటకు 50-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్య కారులు వేటకు వెళ్ళవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.