రాష్ట్రంలో రెండవ విడత రైతుబంధు చెక్కుల పంపిణీ నవంబరులో చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే దానికి ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక అంతకంటే ముందుగానే రైతుబంధు చెక్కుల పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తాజా సమాచారం. సిఎం కెసిఆర్ అంచనా ప్రకారం అక్టోబర్ రెండవ వారంలోపుగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది కనుక అక్టోబర్ మొదటివారం నుంచే రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రభుత్వం దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ పధకంలో భాగంగా రాష్ట్రంలో 58.33 లక్షల మంది రైతులకు పంటపెట్టుబడి సాయంగా ఏకరానికి ఏడాదికి రెండు పంటలకు కలిపి రూ.8,000 చొప్పున అందిస్తోంది. ఈ పధకానికి రూ.12,000 కోట్లు బడ్జెట్ లో కేటాయించగా, దానిలో సగం మొదటివిడతలో పంపిణీ చేసింది. మిగిలిన మొత్తాన్ని కూడా త్వరలోనే పంపిణీ చేయబోతోంది.