న్యూఢిల్లీ, జూలై 18 : వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రెండో రోజే రాజ్యసభ గందరగోళంగా మారింది. సభ ప్రారంభం కాగానే మాయావతి ఉత్తరప్రదేశ్లో దళిత వర్గాలపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడేందుకు సమయం ఇవ్వాల్సిందిగా కోరారు. కానీ ఆమెకు డిప్యూటీ చైర్మన్ సమయం ఇవ్వలేదు. ఆగ్రహానికి గురైన మాయావతి ఇటీవల ఉత్తరప్రదేశ్లో దళితులపై వేధింపులు ఎక్కువయ్యాయని... తనను మరికొంత సేపు మాట్లాడనివ్వాలన్నారు. తనను మాట్లాడనివ్వకపోతే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానన్నారు. అనంతరం ఆమె సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. దీంతో సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి మాట్లాడుతూ మాయావతి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో అగౌరవంగా ప్రవర్తించారని ఆరోపించారు. మాయావతికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యసభ నుంచి వాకౌట్ చేసింది.