హైదరాబాద్ : జనసేన సిద్ధాంతాల కోసం చివరి శ్వాస వరకు పోరాటం చేస్తానని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తాను సీఎం అవడానికి రాజకీయాల్లోకి రాలేదని ఒక ఆశయం తోనే వచ్చానని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా జనసేన కో-కన్వీనర్ శెట్టిబత్తుల రాజబాబు నేతృత్వంలో ఆ జిల్లాకు చెందిన నాయకులు బుధవారం మాదాపూర్లోని పార్టీ కార్యాలయంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ఏమీ ఆశించకుండా రాజకీయాలు చేయాలని చెప్పారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదని లారీ టైర్లతో చెప్పులు కుట్టించుకున్న మహానుభానుడు బీఎస్పీ అధ్యక్షుడు కాన్షీరాం తనకు ఆదర్శమన్నారు. ‘బలమైన నాయకులు లేకపోతే ఆశయాలను ముందుకు తీసుకెళ్లలేం అని అందుకే నాయకుల కోసం వేచి చూస్తున్నాను. కులాలను వాడుకుని కొందరు వ్యక్తులు, వాళ్ల కుటుంబాలే ఎదుగుతున్నాయి. ఆ కులాల ప్రజలు మాత్రం ఎదగలేదు. వాళ్లను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు’ అని ఆరోపించారు.