తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు : జనసేన ప్రణాళిక

SMTV Desk 2018-09-09 19:45:30  janasena , pawan Kalyan,

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ తన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. పొత్తులు, వ్యూహాలపై వివిధ పార్టీ నేతలతో చర్చలు జరుగుతున్నాయి. ఈరోజు మాదాపూర్ లోని జనసేన కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటితో పవన్ సమావేశమయ్యారు. తెలంగాణ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. తెలంగాణ సీపీఎం నేతలు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో ఇటీవల జరిపిన చర్చల వివరాలను పవన్ కళ్యాణ్ కు వివరించారు. తదుపరి చర్చలకు మీరు హజరవ్వాలన్న కమిటి సభ్యుల సూచనను పవన్ అంగీకరించారు. సీపీఎం నేతలను తదుపరి చర్చలకు ఆహ్వానించాలని రాజకీయ వ్యవహారాల కమిటికి పవన్ సూచించారు. మంగళ, లేదా బుధవారం చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సమావేశమయ్యారు. పవన్‌ నేతృత్వంలోని జనసేనతో కలిసి పనిచేయడానికి సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కలిసి పనిచేసే అంశంపై జనసేన ప్రతినిధులు, సీపీఎం నేతలు విస్తృతంగా చర్చలు జరిపారు.