సిఎం కెసిఆర్ రాష్ట్ర బిజెపి నేతలను ఉద్దేశ్యించి “పాపం గరీబోళ్లు ఏవో పగటికలలు కంటుంటారు వాళ్ళ ముచ్చటను మనం ఎందుకు కాదనాలి? ఈసారి వాళ్ళ తమ రెండు సీట్లు గెలుచుకొంటే అదే గొప్ప” అని అన్నారు. కెసిఆర్ మాటలపై బిజెపి నేత కిషన్ రెడ్డి స్పందిస్తూ, “అవును మేము డబ్బుకు గరీబోళ్ళమే...కెసిఆర్ కుటుంబం దగ్గరున్నంత డబ్బు మావద్ద లేదు. కానీ నాలుగు కోట్ల తెలంగాణా ప్రజల అభిమానం పొందిన మేము టిఆర్ఎస్ కంటే గొప్పవాళ్ళమే. కెసిఆర్ నిన్న మాట్లాడినా మాటలు ఆయన అహంకారానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. అదే టిఆర్ఎస్ పతనానికి కూడా కారణం కాబోతోంది. ఆయన నిన్న 105 మంది టిఆర్ఎస్ అభ్యర్ధుల జాబితాను విడుదల చేశారు. అందుకు ఆయనకు మేము కృతజ్నతలు చెప్పుకొంటున్నాము. ఎందుకంటే, వారిలో 30-40 మంది పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయనే గతంలో చెప్పుకొన్నారు. కనుక వారితోనే టిఆర్ఎస్ ఎన్నికలకు వెళితే అది మాకు వరంగా మారుతుంది. ఆ స్థానాలన్నిటిలో అవలీలగా బిజెపి గెలుచుకొంటుంది. కనుక నిన్న ప్రకటించిన ఆ జాబితాలో పేర్లను మార్చవద్దని మేము కెసిఆర్కు విజ్నప్తి చేస్తున్నాము. సెప్టెంబరు 15వ తేదీన మా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణా పర్యటనకు వస్తున్నారు. పాలమూరు పట్టణంలో మా పార్టీ తొలి ప్రచారసభను ఆయనే నిర్వహించబోతున్నారు. ఆయన రాకతో తెలంగాణాలో రాజకీయ బలాబలాలు అనూహ్యంగా మారబోతున్నాయి,” అని అన్నారు