హైదారబాద్, జూలై 17 : తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్లో నిర్వహించిన దేశ రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఓటర్ల సంఖ్య 119 మంది ఎమ్మెల్యేలకు గాను, 117 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు సమాచారం. మిగతా రెండు ఓట్ల హక్కును వినియోగించుకోని వారిలో మజ్లిస్కు చెందిన అక్బరుద్దీన్ ఒవైసీ, తెరాసకు చెందిన మనోహర్రెడ్డి ఉన్నారు. వీరిలో మనోహర్రెడ్డి అనారోగ్యం కారణంగా అపోలో చికిత్స పొందుతుండగా.. మరొకరు ఒవైసీ లండన్ వెళ్లారు. ఉదయం పది గంటలకు ఓటింగ్ ప్రారంభమవ్వగానే సీఎం కేసీఆర్ తొలి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తదుపరి ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం ఓటు హక్కు ముగిసే చివరి సమయానికి భాజపా ఎమ్మెల్యే కిషన్రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు రేపు ఉదయం బ్యాలెట్ బాక్సులను ఢిల్లీకి తరలించనున్నారు.