ప్రగతి నివేదన సభతో టీఆర్ఎస్ పరువు పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఈరోజిక్కడ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల్లో ఉండే వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అమరవీరులను గుర్తించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. బీసీల కోసం కేసీఆర్ సర్కారు ఖర్చు చేసిందెంత? అని ప్రశ్నించారు. సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. గత వారం పది రోజులుగా వందల కోట్లు ఖర్చుపెట్టి ఒక హైప్ క్రియేట్ చేశారని, కానీ కలెక్షన్ నిల్గా నిలిచిందన్నారు. అది కేసీఆర్ ఆవేదన సభగా జరిగిందని విమర్శించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా బహిరంగ సభ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన మండిపడ్డారు. ప్రగతి నివేదన కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడాన్ని తెలంగాణ సమాజం గమనించిందని తెలిపారు. సీఎం కేసీఆర్ నాలుగు ముక్కలు చెప్పడానికి ఇంత పెద్ద సభ అవసరమా ? అని ప్రశ్నించారు.