బెంగుళూరు, జూలై 17 : ప్రస్తుతం కర్ణాటక కారాగార డీఐజీ గా ఉన్న రూపా మౌద్గిల్ను బదిలీ చేస్తూ ఉత్హర్వులు జారీ చేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో రాజభోగాలు అందుతున్నాయని ఉన్నతాధికారులకు సమాచారం అందించిన ఐపీఎస్ అధికారిణి రూపాపై బదిలీ వేటు వేశారు. తనను ట్రాఫిక్ డిపార్ట్మెంటుకు బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. కొందరు జైలు అధికారులు శశికళ వద్ద రూ.2 కోట్లు ముడుపులు తీసుకొని ఆమె కోసం ప్రత్యేకమైన వంటగది, పరుపులు, సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేసినట్లు డీఐజీ రూపా ఉన్నతాధికారులకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో అవినీతి, అక్రమాలపై సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారాన్ని అందించారనే ఆరోపణలపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వం నుంచి ఆమె తాఖీదులు అందుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన అధికారులు మినహా ఇతరులకు ఈ తరహా సమాచారాన్ని నేరుగా అందించడం క్రమశిక్షణ ఉల్లంఘించినట్లేనని అందులో పేర్కొన్నారు. అయితే.. తానేమీ నిబంధనలను ఉల్లంఘించలేదని రూపా అంటున్నారు.