అమరావతి, జూలై 17: రాజధాని అమరావతిలో తొలిసారి జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి :తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్టీ నేతలతో కలిసి అసెంబ్లీకి వచ్చిన వైఎస్ జగన్ ఓటింగ్ ప్రారంభమైన గంటన్నర తర్వాత అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్ లో ఓటేశారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న జగన్ ఆ తరువాత, ఛాంబర్ లో ఉండి పోలింగ్ ను పర్యవేక్షించారు. ఈ మేరకు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు వైఎస్ జగన్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండూ ఓకే అభ్యర్థికి మద్దతు ఇవ్వడం గమనార్హం. స్టేట్ గెస్ట్ హౌస్లో ఎమ్మెల్యేలతో ఆయన భేటీ సందర్భంగా.. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శాసనసభ్యులకు ఆయన వివరించారు. భేటీ అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు బస్సులో అసెంబ్లీకి వెళ్లిన సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్రెడ్డి, అవినాష్ రెడ్డి, బుట్టా రేణుక, వరప్రసాద్, మిథున్ రెడ్డిలు తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు ఎంపీ మేకపాటి నివాసంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ అంశంపై నేతలు చర్చించారు. సమావేశం అనంతరం పార్లమెంట్కు వెళ్లిన నేతలు ఓటింగ్లో పాల్గొన్నారు.