న్యూఢిల్లీ, జూలై 17 : ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బాల్యంలో పశ్చిమ బెంగాల్ లో చదువుకున్నారు. ఆయన మూడు, నాలుగు తరగతులు చదువుకుంటున్నప్పుడు వర్షాకాలంలో రోజు ఒక ఘటన చోటుచేసుకునేదట. చిన్నారి ప్రణబ్ వర్షం వస్తున్నప్పుడు తన దుస్తులను విప్పి వాటిని ఒక కవర్ లో చుట్టుకుని పొలాల మీదుగా తన ఇంటికి చేరుకునేవాడట. వర్షాకాలంలో ఈ విధంగా అర్ధనగ్నంగానే స్కూల్ నుంచి వచ్చేవారట. పాఠశాలలో ప్రణబ్ మార్చ్ ఫాస్ట్ లో ముందుంటూ ప్లాటూన్ వ్యవహరించడంతో ఇంట్లోని వారు ప్రణబ్ ను ముద్దుగా పోల్టూ అని పిలిచేవారు. త్వరలో రాష్ట్రపతి పదవి నుంచి విశ్రాంతి తీసుకోనున్న ప్రణబ్ గురించి అతని చిన్ననాటి స్నేహితుడు జయంత్ ఘోషాల్ ఇటీవల విలేకరులతో ముచ్చటించారు. ప్రణబ్, ఘోషాల్ బాల్య మిత్రులు కావడంతో ఘోషాల్ తనకు ప్రణబ్ బాల్యం గురించి తెలిసిన వివరాలు పంచుకున్నారు. సాధారణంగా బెంగాలీవాసులను ఇంట్లో ముద్దు పేరుతో పిలుస్తుంటారు. వీటికి అమితమైన గుర్తింపు లభిస్తుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ ను ప్రేమతో రోబీ అని పిలిచేవారట. అలానే సత్యజిత్ రే ను మాణిక్ అని, బెంగాలీ సినీస్టార్ ప్రసన్న జీత్ ఛటర్జీని బబ్బూగా పిలుస్తుంటారు. ఇలా పిలవడాన్ని అక్కడివారు అదృష్టంగా భావిస్తుంటారు. ప్రణబ్ పదవి ముగియనుండటంతో అతని స్నేహితుడు ఆయన చిన్ననాటి విషయాలను మీడియాకు తెలిపారు.