ప్రముఖ రాజకీయ, సినీ నటుడు హరికృష్ణ మృతిపై జనసేన అధినేత పవన్ కల్యాన్ సంతాపాన్ని ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ లేఖను పెడుతూ, నేటి జనసేన అధికారిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. హరికృష్ణ ప్రమాదానికి గురయ్యారని తెలియగానే గాయాలతో బయటపడతారని భావించానని, ఆ వెంటనే విషాద వార్త వినాల్సి వచ్చిందని పవన్ వ్యాఖ్యానించారు. 'మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి, సినీ నటుడు శ్రీ నందమూరి హరికృష్ణ మరణ వార్త తెలిసిన తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలియగానే గాయాలతో బయటపడతారు అనుకునేలోగా విషాద వార్త వినాల్సి వచ్చింది. శ్రీ హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలి. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివి. శ్రీహరికృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ విషాద సమయంలో ధైర్యంగా ముందుగా వెళ్లే శక్తి ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను. నా తరఫున, జనసేన శ్రేణుల తరఫున శ్రీ హరికృష్ణకి నివాళులు అర్పిస్తున్నాను. ఈరోజు జనసేన కార్యాలయంలో ముఖ్య నాయకులూ చేరికలు, గిడుగు రామమూర్తి జయంతి వేడుకల నిర్వహణ ఉన్నాయి. వాటిని సహృదయులు శ్రీ హరికృష్ణ మృతికి సంతాపసూచకంగా రద్దు చేస్తున్నాం' అని వెల్లడించారు.