హైదరాబాద్, జూలై 17 : తన ఆశయాన్ని పట్టుదలతో నెరవేర్చుకొని, దానికి సహకారం అందించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపింది పైలట్ సంజన, పైలట్ శిక్షణ ముగించుకుని వచ్చిన ఆమె ఆదివారం సాయంత్రం తెలంగాణభవన్లో సీఎం కేసీఆర్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. మెదక్ జిల్లా కౌడిపల్లి గ్రామానికి చెందిన సంజన చిన్నతనం నుంచి కేసీఆర్ అభిమాని. నాలుగేళ్ల వయసులోనే పలు వేదికలపై కేసీఆర్ తో గొంతు కలిపింది. గతంలో పార్టీ ప్లీనరీ సందర్భంగా సంజనను వేదికపైకి పిలిచిన కేసీఆర్ ఆమెను మాట్లాడించారు. పైలట్ కావాలన్నది సంజన ఆకాంక్ష అని తెలుసుకుని ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఇంటర్ పూర్తి చేసిన సంజన 2015 లో పైలట్ శిక్షణకు ఎంపికయ్యారు. ఈ విషయం తెలిసి ఎల్బీ స్టేడీయంలో జరిగిన ప్లీనరీ వేదిక పై సీఎం కేసీఆర్ రూ.30 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. ఆయన చేసిన సాయంతోనే నేడు ఈ పైలట్ ట్రైనింగ్ పూర్తి చేశానని ఆమె హర్షం వ్యక్తం చేశారు.