హైదరాబాద్, జూలై 20 : బాలీవుడ్ మెగస్టార్ అమితాబ్ బచ్చన్.. నిత్యం సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులోనే ఉంటారు. ఆయన తాజాగా తన కూతురితో కలిసి ఒక ప్రకటనలో నటించిన విషయం తెలిసిందే. ఒక ప్రముఖ బంగారు అభరణాల కంపెనీ ప్రకటనలో కూడా అమితాబ్.. ఆయన కూతురు శ్వేతా ఇద్దరు తండ్రి కూతుళ్లుగానే నటించారు. తెలుగులో అక్కినేని నాగార్జున ప్రచారం చేసే కళ్యాణ్ జూవెలర్స్ కు హిందీలో బిగ్-బి ప్రచారం చేస్తారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమితాబ్ యాడ్ పై వివాదం మొదలైంది. విషయమేమిటంటే.. దుబాయ్ లోని కళ్యాణ్ జువెలర్స్ షోరూంలో నకిలీ బంగారం అమ్మినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలను ఖండించేందుకు కళ్యాణ్ జువెలర్స్ ఒక కొత్త ప్రకటన రూపొందించింది. ఈ ప్రకటనలో అమితాబ్ తో పాటు ఆయన తనయురాలైన శ్వేత నందా నటించారు. ఈ ప్రకటనలో తన పెన్షన్ అమౌంట్ రెండుసార్లు తన బ్యాంక్ అకౌంటులో క్రెడిట్ అయిందంటూ అమితాబ్ బ్యాంకు సిబ్బందికి చెబుతాడు. అప్పుడు బ్యాంక్ అధికారులు ఈ విషయం బయటికి చెప్పకుండా డబ్బులు అలాగే ఉంచేసుకోమని సలహా ఇస్తారు. దీనికి అమితాబ్ అంగీకరించరు. కళ్యాణ్ జువెలర్స్ వాళ్లు కూడా ఇంత నిజాయితీగా ఉంటారంటూ చాటిచెబుతూ ఈ యాడ్ ముగుస్తుంది. దీంతో బ్యాంకు అధికారులను తప్పుగా చూపించారంటూ గొడవ మొదలైంది. ఈ ప్రకటనను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. దీనిపై కళ్యాణ్ జువెలర్స్ సంస్థ స్పందించి ఆ ప్రకటనలో మార్పులు చేస్తామని వెల్లడించింది.