హైదరాబాద్, జూలై 19 : ప్రముఖ నటి సోనాలి బింద్రే హైగ్రేడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె చికిత్స నిమిత్తం న్యూయార్క్ లో ఉన్నారు. ఈ మధ్య చికిత్స నిమిత్తం జుట్టు కత్తిరించుకొని ఈ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తాజాగా ఆమె తన కొడుకు రణ్వీర్ గురించి వెల్లడిస్తూ.. హృదయానికి హత్తుకునే ట్వీట్ను పోస్ట్ చేశారు. తన కొడుకుకి వ్యాధి గురించి తెలిసి రణ్వీర్ ఎలా ఫీలయ్యాడో వివరిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. "రణ్వీర్ జన్మించిన రోజు నుంచి వాడే నా హృదయానికి యజమాని అయ్యాడు. వాడు పుట్టినప్పటి నుంచి నేను, నా భర్త గోల్డి బెహల్ వాడి సంతోషం, శ్రేయస్సే లక్ష్యంగా ఏ పనైనా చేశాం. ఎప్పుడైతే నాకు క్యాన్సర్ ఉందని తెలిసిందో.. ఆ క్షణం నుంచి ఈ విషయాన్ని రణ్వీర్కు ఎలా చెప్పాలా? అని నేనూ, నా భర్త గోల్డీ సతమతమయ్యాం. కానీ ఎలాగోలా వాడికి నిజం చెప్పాలనిపించింది. నిజం చెప్పినా రణ్వీర్లో నాకు ఎలాంటి భయం కనిపించలేదు. అప్పుడు నాకు మరింత ధైర్యం, బలం వచ్చినట్లు అనిపించింది. ఇలాంటి విషయాలను పిల్లలతో పంచుకోవడం ముఖ్యమేనని నా అభిప్రాయం. వారిని బాధపెట్టకూడదని చెప్పకుండా ఊరుకోవడం కంటే చెప్పి వారితో మరింత సమయం గడపడం మంచిది. ఇప్పుడు రణ్వీర్తో కలిసి నేను ఆనందమైన క్షణాలను గడుపుతున్నాను. వాడి అల్లరితో నా జీవితంలోకి మళ్లీ వెలుగు వచ్చినట్లు అనిపిస్తోంది" అని వెల్లడిస్తూ తన కుమారుడితో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు.