చెన్నై, జూలై 15 : దేశమంతా ఒకేసారి లోక్ సభ, అసెంబ్లీ కు ఎన్నికలు జరపాలని కేంద్రం అనుకుంటున్నా విషయం తెలిసిందే. కానీ ఈ నిర్ణయం అమలు జరిగే అవకాశం కనిపించటలేదు. తాజాగా జమిలి ఎన్నికలకు సూపర్ స్టార్ రజనీకాంత్ మద్దతు తెలిపారు. దీని వలన సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయని.. జమిలీ ఎన్నికలకు అన్ని పార్టీలు ఆమోదం తెలపాలని ఆయన సూచించారు. పార్లమెంట్ ఎన్నికల సమయం నాటికి తమ పార్టీ కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు. ఇప్పటివరకు తమిళనాట విద్యావిదానం చాలా బాగుందని రజనీ కాంత్ గుర్తుచేశారు. ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వాన్ని నమ్ముకున్న ప్రజలకు మంచి చేయాలని ఆశిద్దామని పేర్కొన్నారు. 8 వేస్ గ్రీన్ కారిడార్ అభివృద్ధికి మంచి మార్గమని తెలిపారు. అయితే రైతులకు, భూమి కోల్పొయే వారికి పూర్తిస్థాయి పరిహారం ఇవ్వాలని కోరారు. తనను స్ఫూర్తిగా తీసుకొని దొరికిన యాభై వేల రూపాయలను పోలీసులకు అందించిన మహ్మద్ యాసిన్ను రజనీ అభినందించారు. అదేవిధంగా ఏడేళ్ల యాసిన్కు అతను చదువుకునేంత వరకు విద్యాబ్యాసం చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈరోడ్కు చెందిన మహ్మద్ యాసిన్ అనే బాలుడిని రజనీ తన నివాసంలో కలిశారు. మహ్మద్కు ఇటీవల తన పాఠశాల దగ్గర రూ.50 వేలు దొరికాయి. వీటిని ఆ బాలుడు పోలీసులకు అప్పగించి హీరో అయ్యాడు. దీంతో బాలుడు అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ విషయం తెలుసుకున్న సూపర్స్టార్ బాలుడిని తన ఇంటికి పిలిపించారు. బాలుడి నిజాయతీ తనను ఎంతో ఆకట్టుకుందని ఈ సందర్భంగా రజనీ అన్నారు. ఆ చిన్నారి చదువుకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు.