హైదరాబాద్, జూలై 13 : భారతీయ జనతా పార్టీ( బీజేపీ) జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో పట్నా నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు స్వాగతం పలికేందుకు నాయకులు, కార్యకర్తలు, భాజపా శ్రేణులు, పెద్ద సంఖ్యలో వచ్చారు. విమానాశ్రయం ప్రాంగణంలో కార్యకర్తలకు అభివాదం చేసిన అనంతరం ఆయన రాష్ర్ట కార్యాలయానికి బయల్దేరి వెళ్లారు. అమిత్ షా తో పాటు భాజపా జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, రాష్ర్ట అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఇతర నేతలు ఉన్నారు. తెలంగాణలో బీజేపీను బలోపేతం చేయటమే లక్ష్యంగా అధిష్టానం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పదాధికారులు, బూత్ స్థాయి నేతలు, నియోజవర్గం ఇన్ఛార్జ్ లతో అమిత్ షా సమావేశం అవుతారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా.. అధికార టీఆర్ఎస్ ను ఎదుర్కొని అధికారం కైవసం చేసుకోవటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.