జనరల్ రైలు టికెట్ల కోసం.. బుకింగ్‌ యాప్‌..

SMTV Desk 2018-07-12 16:51:45  rail way uts app, scr rail way , south central railway, secundrabad

సికింద్రాబాద్, జూలై 12 : రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇక నుండి సాధారణ టికెట్ల కోసం లైన్లో నిలబడాల్సిన పని లేదు. రిజర్వేషన్‌ లేని సాధారణ (జనరల్‌) టికెట్లను మొబైల్‌ఫోన్‌ నుంచి క్షణాల్లో తీసుకునే అవకాశాన్ని దక్షిణ మధ్య రైల్వే కల్పించింది. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే యూటీఎస్‌ ఆన్‌లైన్‌ మొబైల్‌ యాప్‌ ను రూపొందించింది. ఈ నెల 15 అర్థరాత్రి నుంచి యూటీఎస్‌ యాప్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌ కుమార్‌ వెల్లడించారు. రిజర్వేషన్లు లేని సాధారణ ప్రయాణికుల కోసం ద.మ.రైల్వే అందుబాటులోకి తెచ్చిన ఈ యాప్‌ను ఆయన ఈ రోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినోద్‌ కుమార్‌మాట్లాడుతూ.. "డిజిటల్‌ టెక్నాలజీ వినియోగంలో ద.మ.రైల్వే ముందుంది. సికింద్రాబాద్‌ పరిధిలోని సేవలకు డిజిటల్‌ పేమెంట్‌ మోడ్‌లో చేసేలా ప్రోత్సహిస్తాం. ద.మ రైల్వేలోని పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్ల పరిధిలో ఈ యాప్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ యాప్‌ద్వారా టికెట్లు బుక్‌ చేసుకొనే సౌకర్యం కల్పిస్తాం. ప్లాట్‌ఫాం టికెట్లను కూడా యూటీఎస్‌ యాప్‌ద్వారా బుక్‌ చేసుకోవచ్చు" అని ఆయన వ్యాఖ్యానించారు.