అమరావతి, జూలై 12 : శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పోరాట యాత్రను ముగించుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, తదుపరి కార్యాచరణ లో భాగంగా ఈ నెల 16 నుంచి యాత్రను తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించాలని భావించినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో పవన్ పోరాట యాత్ర ఇటీవలే ముగిసింది. ఉభయ గోదావరి జిల్లాల యాత్రను ఆయన తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించాలని భావించారు. కానీ వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో, అదే సమయంలో పవన్ కూడా పోరాటయాత్ర చేస్తే శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని పోలీసులు అభ్యంతరం వ్యక్తంచేసినట్టు సమాచారం. ఆ నేపథ్యంలో మొదట పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోరాటయాత్ర చేయాలని పవన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.