ఝార్ఖండ్, జూలై 15 : ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల నిషేధం శుక్రవారం ముగిసిన విషయం తెలిసిందే. తాజాగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. ధోనీ చెన్నై సూపర్కింగ్స్ జెర్సీ ధరించి దిగిన ఓ ఫొటోను తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. జెర్సీపై తన పేరు ఉండాల్సిన స్థానంలో ‘తలా’ అని రాసి ఉంది. తలా అంటే తమిళంలో నాయకుడు అని అర్థం. దీంతో అభిమానులు చెన్నై జట్టుకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ ఫొటోకి సోషల్మీడియాలో విపరీతమైన లైక్లు, షేర్లు, కామెంట్లు వస్తున్నాయి. కాగా 2018 ఐపీఎల్ సీజన్ కోసం తమ పాత ఆటగాళ్లను అంటిపెట్టుకునే అవకాశముంటే మాజీ కెప్టెన్ ధోనీని వదులుకునే అవకాశమే లేదని చెన్నై ఫ్రాంఛైజీ ప్రతినిధి జాన్ తెలిపారు.