అమరావతి, జూలై 8 : భాజపా, వైకాపాలు కలిసి పేదవారికి నాణ్యమైన ఇళ్లు కట్టకూడదని కంకణం కట్టుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి లోకేష్ విమర్శించారు. పేదప్రజలు ఎప్పటికీ సరైన ఇళ్లు లేకుండా రోడ్ల పైనే ఉండాలని వారు కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. కేవలం నలుగురు కుటుంబ సభ్యులు ఉండటానికి కోట్లాది రూపాయలతో ప్యాలెస్లు నిర్మించుకున్నారని ఎద్దేవా చేశారు. కోట్ల రూపాయలతో ఇళ్లు నిర్మించుకొని.. పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తుంటే అంత నాణ్యమైన ఇళ్లు ఎందుకని ప్రశ్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఇలా పేదలను కించపరిచేలా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. పేదవారికి ధనికులు ఉండే ఇళ్లతో సమానంగా జరుగుతున్న ఇళ్ల నిర్మాణాన్ని ఎవ్వరూ ఆపలేరంటూ ట్వీట్ చేశారు. దీంతో పాటు వైఎస్ హయాంలో జరిగిన అక్రమాల గురించి వివరించే కొన్ని ఫోటో క్లిప్పింగులను జత చేశారు.