భువనగిరి, జూలై 7 : భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నడాని తట్టుకోలేని ఓ గృహిణి వెంటాడి మరి అతన్ని తరిమికొట్టింది. అయితే ఇక్కడ భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడం విశేషం. ఈ ఘటన భువనగిరిలో చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ఏవోగా పనిచేసిన హరిప్రసాద్కు నిర్మలతో పెళ్లైంది. ఈమె బొమ్మల రామారం మండలం నాగినేనిపల్లిలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కలెక్టరేట్లో విధులు నిర్వర్తించే మరో మహిళతో అక్రమ సంబంధం నెరుపుతున్నాడన్న కారణంతో కొద్దికాలం క్రితమే హరిప్రసాద్ను విధుల నుంచి తప్పించారు. గతంలోనూ ఇదే విషయంపై పెద్ద గొడవ జరగడంతో సదరు ఏవోను సెలవుపై పంపించారు. హరిప్రసాద్ వివాహేతర సంబంధం విషయమై నిర్మల పలుమార్లు గొడవ పడి పెద్దల ముందు పంచాయతీ పెట్టించారు. అయినా తన పద్ధతి మార్చుకోని హరిప్రసాద్.. తరచూ రహస్యంగా తన ప్రియురాలిని కలుస్తున్నాడు. అంతేకాకుండా నిర్మలను, పిల్లలను వేధిస్తున్నాడు. విషయంపై విసుగు చెందిన నిర్మల అతడి కదలికలపై నిఘా పెట్టింది. ఓ ఇంట్లో ప్రియురాలితో కలిసి ఉన్న భర్తను కుటుంబసభ్యులతో కలిసి బయటకి ఈడ్చుకొచ్చి వెంటాడి తరిమికొట్టింది. ఆ తర్వాత పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.