మరో సిరీస్ కొట్టేస్తారా..!

SMTV Desk 2018-07-05 16:42:58  india vs england 2nd t-20, england tour of india, kohli, k.l rahul

కార్డిఫ్, జూలై 5 ‌: ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లిసేన అదిరే ఆరంభాన్ని సాధించింది. మూడు టీ-20ల సిరీస్‌లో భాగంగా రెండో టీ20 మ్యాచ్‌ శుక్రవారం జరుగనుంది. కార్డిఫ్‌ వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టీ 20 మ్యాచ్‌ రాత్రి 10.00లకు(భారత కాలమాన ప్రకారం) ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచినట్లయితే ఇంకా మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. మొదటి టీ 20లో కుల్దీప్‌ యాదవ్‌ విజృంభణకు తోడు.. కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్ జోరుతో భారత్‌ సునాయాసంగా విజయాన్ని అందుకుంది. మరొకసారి అదే ఫలితాన్ని రిపీట్ చేయాలనీ కోహ్లిసేన భావిస్తుంది. గతేడాది నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచిన భారత్‌.. ఆపై ఇప్పటివరకూ పొట్టి ఫార్మాట్‌లో సిరీస్‌ను కోల్పోలేదు. న్యూజిలాండ్‌పై సిరీస్‌ సాధించిన తర్వాత.. శ్రీలంక, దక్షిణాఫ్రికాలపై సైతం సిరీస్‌లను దక్కించుకొంది. ఆపై శ్రీలంకలో జరిగిన నిదాహాస్‌ ముక్కోణపు టీ20 సిరీస్‌ను కూడా గెలవగా, ఇటీవల ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌ను కూడా క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ క‍్రమంలోనే ఇంగ్లండ్‌తో రేపటి మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే వరుసగా ఆరో టీ20 సిరీస్‌ను సాధించినట్లవుతుంది. కాగా, సొంత గడ్డపై సత్తాచాటేందుకు ఇంగ్లండ్‌ తీవ్ర కసరత్తులు చేస్తోంది. ప్రధానంగా తొలి టీ20లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. దీంతో ఇరుజట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది.