హైదరాబాద్, జూలై 4 : వరంగల్ జిల్లా కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్ వర్స్క్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆ సమయంలో గోదాములో 25 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం ప్రకటిస్తు.. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రమాద స్థలంలో సహాయచర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులను ఆదేశించారు. భద్రకాళి ఫైర్ వర్క్స్ గోదాములో ఒక్కచోట చిన్నగా నిప్పురాజుకోవడంతో బాణాసంచా కాలడం మొదలైంది. కొన్ని క్షణాల్లోనే పెద్ద ఎత్తున బాణాసంచా దగ్దం కావడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. క్షతగాత్రులను 108 వాహనాల్లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.