కోటిలింగాల, జూలై 2 : వరంగల్ ఘోరం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్ వర్స్క్ గోదాంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. భద్రకాళి ఫైర్ వర్క్స్ గోదాములో ఒక్కచోటు చిన్నగా నిప్పురాజుకోవడంతో బాణాసంచా కాలడం మొదలైంది. కొన్ని క్షణాల్లోనే పెద్ద ఎత్తున బాణాసంచా దగ్దం కావడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో గోదాములో పనిచేస్తున్న కార్మికులను రక్షించేందుకు వీలులేక పోవడంతో ఆరుగురు వ్యక్తులు మంటల్లో ఆహుతయ్యారు. ఇంకా పలువురు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. క్షతగాత్రులను 108 వాహనాల్లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిక తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.