ఢిల్లీలో విషాదం.. 11 మంది ఆత్మహత్య

SMTV Desk 2018-07-01 11:58:30  delhi family suicide, delhi suicide, delhi shocker 11 family members suicide, north delhi

ఢిల్లీ, జూలై 1 : దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. నార్త్ ఢిల్లీలోని బురారీ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. మృతుల కళ్లకు గంతలతో పాటు నోటికి అడ్డుగా గుడ్డ కట్టి ఉన్నాయి. అందరూ కూడా ఇంటి సీలింగ్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. స్థానికుల కథనం ప్రకారం..వారు ఫర్నీచర్‌ వ్యాపారం చేసేవారట. రోజూ ఉదయం 6 గంటలకు షాప్‌ తెరిచేవారు, ఈరోజు 7.30 అయినా తెరవకపోవడంతో అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లిచూశామని 11 మంది ఉరేసుకున్నట్లు కన్పించడంతో పోలీసులకు సమాచారం అందించినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈదుర్ఘటనపై బంధువులు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేశారు. డబ్బుకోసం హత్య చేశారంటూ కొందరు ఆరోపించగా.. మరి కొందరు కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారంటూ అనుమానం వ్యక్తం చేశారు. వ్యాపారంలో బాగా దెబ్బతినడంతో కుటుంబసభ్యులంతా మూకుమ్మడి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యా, ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.