హైదరాబాద్, జూన్ 30 : హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ధైర్యముంటే మోదీ, అమిత్షా హైదరాబాద్ నుంచి పోటీ చేసి గెలవాలని చాలెంజ్ విసిరారు. తన మద్దతు దారులతో ఇవాళ హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ..."అందరూ హైదరాబాద్ సీటును మా నుంచి లాక్కోవాలని చూస్తున్నారు. దమ్ముంటే ఎవరైనా హైదరాబాద్ నుంచి ఎంఐఎం మీద పోటీ చేయాలని సవాల్ విసురుతున్నా" అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సైతం ఇక్కడ పోటీచేయాలంటూ ఒవైసీ సవాల్ చేశారు. "హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్కు సైతం చాలెంజ్ చేస్తున్నా.. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా మమ్ముల్ని ఓడించలేరు" అని అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. జూన్ 25ను బ్లాక్డేగా పాటించాలంటూ మోదీ చెబుతున్నారనీ... అయితే మహాత్మాగాంధీ హత్య, బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్ అల్లర్లు సహా స్వతంత్ర భారత దేశంలో చోటు చేసుకున్న కల్లోల ఘటనలను ప్రజలు మర్చిపోరని పేర్కొన్నారు.