బెంగుళూరు, జూలై 14 : పెద్ద కంపెనీలు చిన్న కంపెనీలను కొనుగోలు చేయడం మాములు విషయమే కాని ఆ సంస్థ స్థాపించి కనీసం నాలుగు మాసాలు కూడా కానీ చిన్న స్టార్టప్ "హళ్లి లాబ్స్ను" గూగుల్ సంస్థ స్వాధీనం చేసుకోవడం సంచలనమే అని చెప్పాలి. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్కు సంబంధించి హళ్లి పరిశోధనలు జరుపనుంది. అతి తక్కువ వ్యవధిలో గూగుల్ లాంటి పెద్ద కంపెనీ దీన్ని తన ఖాతాలో వేసుకోవడంతో పెద్ద ఐటీ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్కు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో అర్థమవుతోంది. కృత్రిమ మేథకు సంబంధించి అనేక కంపెనీలు పరిశోధనలు జరుపుతుండగా ఇప్పటికే ఈ రంగంపై గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, ఐబీఎం, యాపిల్... తదితర దిగ్గజ కంపెనీలు దృష్టిసారించాయి. 2020 కల్లా కృత్రిమ మేథకు సంబంధించిన మార్కెట్ 50 బిలియన్ డాలర్లకు చేరే అవకాశముంది. సెల్ఫ్డ్రైవింగ్, ఆన్లైన్లో బాట్లతోనే వినియోగదారులతో చాటింగ్ చేయడం, డ్రోన్లు... తదితర అంశాలకు సంబంధించి కృత్రిమమేథదే కీలక స్థానమని చెప్పవచ్చు. నిత్య జీవితంతో కృత్రిమమేథ భాగం కావడంతో పాటు రానున్న కాలంలో కృత్రిమమేథ రంగానికి చెందిన పరిశోధనలు మరింతగా పెరగనున్నాయి. ఇంజినీరింగ్ కోర్సులు అభ్యసించే విద్యార్థులు ఈ రంగంపై దృష్టిపెడితే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతాయని సమాచారం.