కడప, జూన్ 27 : కడప ఉక్కు కర్మాగారం కోసం దీక్ష చేస్తున్న టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సుగర్, బీపీ స్థాయి ప్రమాదకర స్థాయికి చేరడంతో తక్షణమే చికిత్స అందించకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు నివేదించారు. ఆ నివేదిక ఆధారంగా పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు. ఆయనను వైద్య చికిత్సల నిమిత్తం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఎంపీ సీఎం రమేశ్ దీక్ష కొనసాగిస్తున్నారు. కేంద్రం నాటకాలు ఆడుతుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీక్ష కొనసాగుతుందే కానీ ఆపే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. బీటెక్ రవి ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆయనను ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు యత్నించగా తెదేపా శ్రేణులు అడ్డుకొనే ప్రయత్నం చేశాయి. అయినప్పటికీ పోలీసులు ఆయనను బలవంతంగా అంబులెన్స్లో తరలించారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి రవి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు నివేదించడంతో దీనిపై సమీక్షించిన మంత్రి గంటా శ్రీనివాసరావు.. బీటెక్ రవికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాలని ముఖ్యమంత్రికి నివేదించారు.