హైదరాబాద్, జూన్ 27 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ పర్యటన ఖరారయ్యింది. గురువారం ఆయన కుటుంబ సమేతంగా కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే బంగారు కానుకలు సమర్పిస్తానని కేసీఆర్ ఉద్యమ సమయంలో మొక్కుకున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం కేసీఆర్ కుటుంబంతో కలిసి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బెజవాడకు చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నగరంలోని ఓ హోటల్కు వెళతారు. తర్వాత అమ్మవారిని దర్శించుకొని తిరిగి సాయంత్రం హైదరాబాద్కు బయలదేరనున్నారు. ఇప్పటికే తిరుమల శ్రీవారికి సాలిగ్రామహారం, కంఠాభరణం.. వరంగల్లోని భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం.. కురవిలోని వీరభద్రస్వామికి బంగారు మీసాలు సమర్పించారు. ఇప్పుడు దుర్గమ్మ మొక్కు చెల్లించుకోబోతున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ రెండవసారి ఏపీ పర్యటనకు వెళుతుండగా.. ఆయన్ను ఏపీ ప్రభుత్వం తరపున ఎవరు స్వాగతం పలుకుతారన్నది ఇంకా స్పష్టత లేదు.