అమరావతి, జూన్ 26 : ఏపీలో నిరుద్యోగులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 20వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చే అంశంపై టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. భేటీ తర్వాత ఈ విషయాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు వెల్లడించారు.టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఉక్కు దీక్షకు మద్దతుగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నట్టు కళా తెలిపారు. రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం 1500 రోజుల పాలన పూర్తవుతున్న సందర్భంగా జులై 16న గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. నాలుగు నెలల్లో 75 రోజులు గ్రామ దర్శినిలో భాగంగా గ్రామ సభలు నిర్విహించనున్నారు. వచ్చే ఎన్నికలపై ఇటీవల వచ్చిన సర్వేల పట్ల వివిధ పార్టీలు పలు వ్యాఖ్యలు చేస్తున్నాయనీ, ఎవరేమన్నా నూటికి నూరు శాతం ప్రజలు టీడీపీతోనే ఉన్నారని ధీమాగా చెప్పారు. ఉద్యమంలా సాగుతోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.