డుబ్లిన్, జూన్ 25 : టీమిండియా క్రికెట్ జట్టులో రామలక్ష్మణులు ఎవరో మీకు తెలుసా? అంతాలా ఆలోచించకండి.. మన ప్రశ్నకు భారత్ జట్టు స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్ చక్కటి సమాధానం చెప్పేశాడు. ప్రస్తుతం కోహ్లీ సేన ఐర్లాండ్లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆతిథ్య ఐర్లాండ్తో భారత్ రెండు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు శనివారం భారత్ నుంచి ఐర్లాండ్ బయలుదేరారు. విమానంలో వెళ్లే సమయంలో కోహ్లీ-ధోనీ మధ్యలో శిఖర్ ధావన్ కూర్చున్నాడు. విమాన ప్రయాణంలో బోర్ కొట్టకుండా ఆటగాళ్లు సందడి చేశారు. ఆ సమయంలో ధావన్ ఒక పాట కూడా పాడాడు. ఈ పాటలో మహేంద్ర సింగ్ ధోనీని రాముడితో.. విరాట్ కోహ్లీని లక్ష్మణుడితో పోల్చాడు. "వీరిద్దరూ ఎంతో కీలకమైన వారు. ఒకరు రాముడు(ధోనీ).. మరొకరు లక్ష్మణుడు(కోహ్లీ)" అన్న వీడియోను ధావన్ అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అంతేకాదండోయ్ "పాట సరిగ్గా పాడకపోతే క్షమించండి" అని ధావన్ కోరాడు. ఈ నెల 27, 29న భారత్ ఆతిథ్య ఐర్లాండ్తో రెండు టీ20 మ్యాచ్లు ఆడనుంది. అనంతరం అక్కడి నుంచి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. జులై 3 నుంచి ఇంగ్లాండ్-భారత్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభంకానుంది.