రంగారెడ్డి, జూన్ 25 : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయందోళనకు గురి చేస్తున్నాయి. యాదాద్రి జిల్లాలో ఆదివారం జరిగిన దుర్ఘటన మరవక ముందే మరో ఘోర ప్రమాదం ఐదుగురు శ్రమ జీవులను బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, లింగంపల్లి వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు, ఆటోలు ఎదురెదురుగా ఢీకొట్టడంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా ఆటోలో కూరగాయలను హైదరాబాద్ తీసుకువస్తూ మృత్యువాత పడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలే ఉండటం హృదయ విదారకం. మృతులు ఆటో డ్రైవర్ శీను, సుజాత, మాధవి, మారు, అఫిలీగా గుర్తించారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.