విజయవాడ , జూన్ 22 : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల రాజకీయంగా దూకుడు పెంచారు. పోరాట యాత్రలో పాల్గొంటూ ప్రజల్లో మమేకమవుతున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకున్న ఆయన మరి కొద్ది రోజుల్లో రెండో విడత పోరాట యాత్ర ప్రారంభించనున్నారు. తాజాగా పవన్ ఈరోజు విజయవాడలోని పడమటలంకలో నూతన గృహప్రవేశం చేశారు. అద్దెకు ఓ ఇంటిని తీసుకున్న పవన్ శుక్రవారం సతీసమేతంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా నంబూరులో లింగమనేని టౌన్షిప్ వద్ద నిర్మించిన దశావతార వెంకటేశ్వరస్వామి దివ్య ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి.. సంప్రదాయ వస్త్రధారణతో వెళ్లిన పవన్ కల్యాణ్ అంతకుముందే అద్దెకు తీసుకున్న ఇంట్లో పూజలు చేశారు. నిన్న హైదరాబాద్ నుంచి కుటుంబ సమేతంగా విజయవాడ చేరుకున్న పవన్... ఈ రోజు ఉదయం నిరాడంబరంగా గృహప్రవేశం చేశారు. ప్రస్తుతం పవన్ విజయవాడకు ఎప్పుడొచ్చినా హోటల్లోనే ఉంటున్నారు. మరో వైపు పవన్ నాగార్జున వర్శిటీ సమీపంలోని కాజ గ్రామంలో సొంత ఇంటిని, కార్యాలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే అక్కడి పనులు ఆలస్యంమవుతుండటంతో అద్దె ఇల్లు తీసుకోవాలని పవన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.