ఖోస్ట్, మే 29 : ముస్లింల పవిత్ర రంజాన్ ఉపవాసం తొలిరోజు ఆప్ఘన్లో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఖోస్ట్ నగరంలో భద్రతా దళాలే లక్ష్యంగా ఉగ్రవాదులు శనివారం ఆత్మాహుతి దాడి చేశారు. పేలుడు పదార్థాలు ఉన్న కారుతో బస్టాండ్ను ఢీకొట్టడంతో 18మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఆరుగురు గాయపడ్డారని ఆప్ఘన్ అంతర్గత మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి నజీబ్ డానిశ్ తెలిపారు. ఈ ఘటనలో మృతిచెందిన వారు పౌరులు, ఖోస్ట్ ప్రొవిన్షియల్ ఫోర్స్ (కేపీఎఫ్) సభ్యులని పోలీసు ఉన్నతాధికారి ఫైజుల్లా గైరత్ చెప్పారు. దాడి చేసినట్టు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.