కోటా, జూన్ 20 : బాబాల గురించి యోగా గురు బాబారాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను తాము దేవుళ్లుగా చెప్పుకునే వాళ్లు, బాబాలు అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే ఉరి తీయాలని ఆయన అన్నారు. బాబాల పేరిట అక్రమాలకు పాల్పడుతున్న వారిని ప్రస్థుతం జైలుకు పంపిస్తున్నారని కాని వారిని ఉరితీసి చంపాలని సూచించారు. రాజస్థాన్ లోని కోట నగరంలో జరిగిన మీడియా సమావేశంలో రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాషాయ దుస్తులు ధరించినంత మాత్రాన అందరూ ఆధ్యాత్మిక గురువులు అయిపోరని వ్యాఖ్యానించారు. "ప్రతి వృత్తికి దానికి సంబంధించిన పరిమితులు ఉంటాయి. ప్రతి ఉద్యోగానికి ప్రొటోకాల్ ఉంటుంది. బాబాల విషయంలోనే అలాగే ఉంటుంది. కేవలం కాషాయ దుస్తులు ధరిస్తే బాబాలు అయిపోరు. అది వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది" అని రాందేవ్ వెల్లడించారు. బాబా ధాటి మహారాజ్పై అత్యాచారం కేసు నమోదు అయిన నేపథ్యంలో రాందేవ్ బాబా ఈ విధంగా స్పందించారు. ధాటి మహారాజ్ రెండేళ్ల క్రితం శాని ధామ్ ఆశ్రమంలో తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదైంది. ప్రస్తుతం కేసు దిల్లీ క్రైం బ్రాంచికి తరలించారు. గతంలో ఆశారాం బాపు సహా పలువురు బాబాలపై అత్యాచార కేసులు నమోదైన విషయం తెలిసిందే.