హైదరాబాద్, జూన్ 18 : మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. కరుణాకరన్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం "తేజ్ ఐ లవ్ యు". అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్ మూవీ మేకర్స్ పతాకంపై కె.ఎస్.రామారావు, వల్లభ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ బాణీలు సమకూర్చారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆడియో సక్సెస్ మీట్ను నిర్వహించింది. ఈ సందర్భంగా కథానాయకుడు సాయిధరమ్తేజ ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు. మేనమామ చిరంజీవి పోలీకలు తనకు రావడం ఎంతో అదృష్టమని ఈ సందర్భంగా సాయిధరమ్ పేర్కొన్నారు. చిరంజీవిలానే నటిస్తున్నావంటూ అభిమానులు చెబుతుంటారని.. అప్పుడు తనకు ఎంతో సంతోషం కలుగుతుందని చెప్పాడు. కానీ, తాను చిరంజీవిని అనుకరించడం లేదని.. తన సొంత స్టైల్ లోనే నటిస్తున్నానని తెలిపాడు. ఈ సినిమాలో పార్ట్టైం ఉద్యోగం చేస్తూ కళాశాల విద్యార్థిగా చదువుకునే పాత్ర చేశానని.. సకుటుంబ సమేతంగా సినిమా చూసి ఆనందించేలా దర్శకుడు చిత్రాన్ని నిర్మించాడన్నారు. దర్శకుడు, నిర్మాత నాకు మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించారని చెప్పుకొచ్చారు. తన తదుపరి చిత్రం గురించి మాట్లాడుతూ.. మైత్రి మూవీ బ్యానర్ లో త్వరలోనే కొత్త చిత్రం రానున్నట్లు వెల్లడించారు.