హైదరాబాద్, జూన్ 17 : అమెరికాలో టాలీవుడ్ నటీనటులతో సెక్స్ రాకెట్ నడిపిస్తున్న ఎన్నారై మోదుగుమూడి కిషన్ తన భార్య చంద్రలను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు సినిమాలను కూడా నిర్మించిన అతను... సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ నమ్మించి, వారిని వ్యభిచారంలోకి దింపుతున్నాడు. ఈ విషయం అక్కడి పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో, భార్యాభర్తలిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ సంచలనం వెలుగుచూడడంతో పాటు టాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఈ సెక్స్ రాకెట్ లో ఉన్నారనే విషయం బయటపడింది. అయితే ఈ సెక్స్ రాకెట్ గురించి హీరోయిన్ మెహ్రీన్ తనకు అమెరికాలో ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించారు. అక్కడి ఎయిర్పోర్ట్లోని ఇమ్మిగ్రేషన్ అధికారులు మెహ్రీన్ టాలీవుడ్ నటి అని తెలిసి ఆమెను విచారణ నిమిత్తం నిలిపివేశారట. "నా తల్లిదండ్రులను కలవడానికి వాంకువేర్ నుంచి అమెరికాకు వెళుతుండగా నేను టాలీవుడ్ నటిని అని తెలిసి ఇమ్మిగ్రేషన్ అధికారులను నన్ను నిలిపివేశారు. సెక్స్ రాకెట్కు సంబంధించి నన్ను పలు ప్రశ్నలు అడిగారు. నేను షాకయ్యాను. నేను తరచూ అమెరికాకు వెళ్లి వస్తుంటాను. కానీ అక్కడ టాలీవుడ్ నిర్మాత సెక్స్ రాకెట్ నడుపుతున్న విషయం వారు చెప్పేవరకు నాకు తెలీదు. అమెరికాకు వచ్చే ప్రతీ టాలీవుడ్ నటిని విచారిస్తున్నామని తెలిపారు" అని పేర్కొన్నారు. తనతో పాటు మరో ముగ్గురు తెలుగు కథానాయికలను కూడా దాదాపు 6 గంటల పాటు విచారించినట్లు తెలుస్తోంది.