ముంబై, జూన్ 16 : : ఐపీఎల్-11 సీజన్ విజేతగా ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిలిచిన విషయం తెలిసిందే. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్తో ఉన్న చెన్నై మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకొంది. రెండేళ్ల నిషేధం తర్వాత ఈ ఏడాది ఐపీఎల్లో పునరాగమనం చేసిన చెన్నై సూపర్కింగ్స్ టైటిల్తో పాటు తన బ్రాండ్ విలువను సైతం పెంచుకుంది. ఇప్పటివరకూ ఐపీఎల్లో అత్యంత విలువైన బ్రాండ్గా కోల్కతా నైట్రైడర్స్ను.. తాజాగా చెన్నై సూపర్కింగ్స్ అధిగమించినట్లు తెలిసింది. బ్రాండ్ ఫైనాన్స్ డైరెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది చెన్నై సూపర్కింగ్స్ బ్రాండ్ విలువ రూ. 445కోట్లకు పైగా చేరుకుంది. కోల్కతా నైట్రైడర్స్ రూ.425కోట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. మూడో స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఉంది. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం కారణంగా చెన్నై సూపర్కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ రెండేళ్ల(2016,17) పాటు ఐపీఎల్ నుంచి నిషేధం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది నిషేధం పూర్తి కావడంతో ఈ రెండు జట్లు తిరిగి ఐపీఎల్లోకి పునరాగమనం చేశాయి. ప్రతి సీజనులో చెన్నై టాప్-4లో నిలుస్తుండటం, తాజాగా ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించి టైటిల్ గెలుచుకోవడంతో దీని బ్రాండ్ విలువ క్రమంగా పెరుగుతూ వచ్చింది.