మెగాఫోన్ పట్టనున్న మరో రచయిత..

SMTV Desk 2018-06-15 19:12:17  diamond ratnababu, writer ratnam babu, writer diamond ratnam, tollywood

హైదరాబాద్, జూన్ 15 : తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితలగా తమ కలానికి పదును పెట్టి.. పలు సినిమాలకు రచనలు చేసి తరవాత దర్శకులుగా మారిన వారు చాలా మందే ఉన్నారు. అందులో దాసరి నారాయణరావు నుండి జంధ్యాల, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, అనిల్ రావిపూడి తదితరులు రచయితల నుంచి దర్శకులుగా మారి విజయం సాధించారు. ఇటీవల వక్కంతం వంశీ కూడా మెగా ఫోన్ పట్టి అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా’ సినిమాను తెరకెక్కించారు. తాజాగా మరో రచయిత మెగా ఫోన్ పట్టబోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మారుతున్నారు. యంగ్ హీరో ఆది సాయికుమార్‌కు డైమండ్ రత్నబాబు చెప్పిన కథ నచ్చడంతో ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. కథ కొత్తగా, విభిన్నంగా ఉంటుందని, ఆద్యంతం వినోదభరితంగా చిత్రం ఉంటుందని సమాచారం. దీపాల ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తారు. యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పరిచయమైన ‘దేవదాసు’ చిత్రానికి డైమండ్ రత్నబాబు ఘోస్ట్ రైటర్‌గా పనిచేశారు. ఆ తరవాత ‘సీమశాస్త్రి’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘సెల్ఫీ రాజా’, ‘ఈడోరకం ఆడోరకం’, తాజాగా మోహన్ బాబు ‘గాయత్రి’ సినిమాకు రచయితగా పనిచేశారు. ఇప్పుడు మెగాఫోన్ పట్టబోతున్నారు. మరి రచయితగా విజయం సాధించిన రత్నబాబు దర్శకుడిగా ఆకట్టుకుంటారో లేదో చూడాలి.