కరీంనగర్, జూన్ 15 : కరీంనగర్లో విషాదం చోటుచేసుకుంది. కలెక్టర్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న మీసేవా కేంద్రంలో పనిచేస్తున్న ఓ యువతిని ఉన్మాది గొంతుకోసి హత్య చేశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న యువతిని మీ సేవా సిబ్బంది ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది. నిందితుడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుండగా స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి ఆధార్ కార్డు ద్వారా ఆధారాలు సేకరించిన పోలీసులు ఆమెను రామగుండంలోని హనుమాన్నగర్కు చెందిన రసజ్ఞ(22) అని తెలిపారు. ఆమె మూడు నెలల క్రితమే ఇక్కడ చేరినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఓ యువకుడు వచ్చి మాట్లాడాలని కోరడంతో ఆమె బయటకు వెళ్లిందని.. కొద్ది నిమిషాల తర్వాత అతడు యువతి గొంతు కోసేశాడని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. అనంతరం యువతిపై దాడి చేసి ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంకు చెందిన వంశీధర్ అని పోలీసులు వెల్లడించారు. ఇరువురి ప్రేమ వ్యవహారమే హత్య కారణంగా అనుమానిస్తున్నారు.