ఆ ముగ్గురికి జీవిత ఖైదు ..

SMTV Desk 2018-06-14 17:47:41   P Naga Vaishnavi, P Naga Vaishnavi murder case, vijayawada, vijayawada session court

విజయవాడ, జూన్ 14 : రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిదేళ్ల క్రితం 2010లో సంచలనం సృష్టించిన నాగవైష్ణవి హత్య కేసులో గురువారం తీర్పు వెలువడింది. ఎనిమిదేళ్ల విచారణ తర్వాత విజయవాడ మహిళా సెషన్స్‌ జడ్జి ఈ కేసులో తుది తీర్పు ప్రకటించారు. గురువారం నిందితులకు శిక్ష ఖరారు చేసే ముందు ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి, ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు. న్యాయస్థానం తీర్పు పట్ల నాగవైష్ణవి బంధువులు, విద్యార్థి, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే తీర్పు కోసం ఏకంగా ఎనిమిదిన్నరేళ్లు పట్టడంపై మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజయవాడకు చెందిన బీసీ నాయకుడు పలగాని ప్రభాకర్‌ కుమార్తె నాగవైష్ణవి 2010 జనవరి 30న కారులో పాఠశాలకు వెళుతుండగా దుండగులు అడ్డగించి డ్రైవరును హతమార్చి వైష్ణవిని అపహరణ చేశారు. రెండు రోజుల పాటు తీవ్ర గాలింపుల తర్వాత, గుంటూరు శివార్లలోని ఆటోనగర్‌లోని ప్లాట్ నెంబరు 445లో చిన్నారి శవం లభ్యమైంది. అభం శుభం తెలియని చిన్నారిని వేధింపులకు గురిచేసి, అనంతరం బాయిలర్‌లో వేసి బాలికను కాల్చి చంపినట్లులో పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో కారు డ్రైవరు సంఘటనా స్థలంలోనే కత్తిపోట్లకు గురై మృతి చెందగా... కుమార్తె చనిపోయిన బాధ దిగమింగుకోలేక తండ్రి గుండెపోటుతో మరణించాడు. విచారణ క్రమంలో న్యాయం కోసం పోరాడుతున్న చిన్నారి తల్లి, బాబాయి మరణించడం అత్యంత హృదయ విదారకరం. ఈర్ష్య, అసూయ, ఆస్తి కోసం వివాదాలే ఈ దారుణానికి కారణంగా నిర్ధారించిన పోలీసులు ముగ్గురు నిందితులను కటకటాల్లోకి నెట్టారు. ప్రభాకర్‌పై కోపంతో ఆయన మొదటి భార్య వెంకటేశ్వర్వమ్మ తమ్ముడు పంది వెంకట్రావు ఈ హత్యకు కట్ర పన్నిట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా మెర్ల శ్రీనివాసరావు, ఏ2గా వెంపరాల జగదీష్, ఏ3గా పంది వెంకట్రావు అలియాస్‌ కృష్ణ ఏడేళ్లుగా జైలులో రిమాండ్‌లోనే ఉన్నారు. నిందితులకు బెయిల్‌ మంజూరు చేయకుండానే కేసు విచారణ పూర్తి చేశారు. వారిపై ఐపీసీ 302, 367, 420, 201, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చార్జిషీట్‌ దాఖలు చేశారు.