మాస్కో, జూన్ 14 : ఫిఫా వరల్డ్కప్-2018 అంతా సిద్ధమైంది. 32 దేశాలు ఎనిమిది గ్రూపులుగా విడిపోయి 32రోజుల పాటు తలపడనున్న ఈ మహాయుద్ధానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. లుజ్నికి స్టేడియంలో జరిగే ఆరంభ వేడుకతో ఈ మెగా టోర్నీ ఆరంభమవుతుంది. ఈ ప్రపంచకప్లో తక్కువ ర్యాంకు జట్లైన ఆతిథ్య రష్యా, సౌదీ అరేబియాల మధ్య తొలి పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో ఫుట్బాల్కు మద్దతుగా గూగుల్ సంస్థ కూడా ప్రత్యేక డూడుల్ను రూపొందించింది. దీనిలోభాగంగా ఫుట్బాల్ ఆడుతున్నట్లు ఉన్న ఓ కార్టూన్ చిత్రాన్ని ఉంచి తన మద్దతు తెలిపింది. మరోవైపు ప్రపంచ నలుమూలల నుంచి అభిమానులు నేరుగా మ్యాచ్లను వీక్షించేందుకు రష్యాకు చేరుకున్నారు. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీ, ఆల్టైమ్ ఫేవరెట్ బ్రెజిల్, మాజీ ఛాంపియన్లు అర్జెంటీనా, ఉరుగ్వే, ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లాండ్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మన దేశంలోని ఫుట్బాల్ అభిమానులు గత ప్రపంచకప్ల సందర్భంగా తెల్లవారుజాము మ్యాచ్లు, అర్ధరాత్రి పోరాటాలు చూసేందుకు నిద్రను త్యాగం చేయాల్సి వచ్చేది. ఈసారి ఆ అవసరం లేదు...! ఎందుకంటే ప్రస్తుతం కప్ జరగనున్న రష్యా వేళలతో పోలిస్తే భారత సమయం రెండున్నర గంటలు ముందుంది. లీగ్ దశలో ఈజిప్ట్–ఉరుగ్వేల మ్యాచ్ ఒక్కటి మధ్యాహ్నం 3.30కు ప్రారంభం అవుతోంది. మిగతావాటిలో చాలావరకు సాయంత్రం 5.30 నుంచి మొదలవుతున్నాయి. ఇంకా సంతోషించాల్సిన సంగతి ఏమంటే... నాకౌట్ సహా లీగ్ దశలో పెద్దపెద్ద జట్ల మ్యాచ్లు రాత్రి 7.30 నుంచి జరగనున్నాయి. తక్కువ సంఖ్యలో మాత్రమే అర్ధరాత్రి వేళ సాగనున్నాయి. కాబట్టి ఐపీఎల్ తరహాలోనే ఫిఫా ప్రపంచకప్నూ మనం ఆసాంతం ఆస్వాదించవచ్చు.